న్యూఢిల్లీ, జూన్ 10: నీట్ పీజీ కౌన్సెలింగ్లో మిగిలిపోయిన 1,456 సీట్ల భర్తీకి మళ్లీ ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘కిందటేడాది నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు సంబంధించి ఇప్పటికే తొమ్మిది సార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. తరగతులు ప్రారంభమై ఏడాది కావొస్తున్నది. విద్యార్థులు ఇప్పుడు వచ్చి ఆ కోర్సుల్లో అడ్మిషన్లు అడగడం తగదు’ అని వ్యాఖ్యానించింది. మిగిలిపోయిన సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించనక్కర్లేదన్న కేంద్రప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ నిర్ణయాన్ని ఏకపక్ష నిర్ణయంగా భావించరాదని, వైద్య విద్యలో నాణ్యత, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే కౌన్సెలింగ్ ఆపేశారని వ్యాఖ్యానించింది. వైద్య విద్య నాణ్యతలో రాజీపడలేమని స్పష్టం చేసింది. ఢిల్లీలో నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కూడా కోర్టు ఇదే తీర్పునిచ్చింది. 2021-22 సంవత్సరానికి గాను నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఈ మేరకు కేంద్రప్రభుత్వం, ఇండియన్ నర్సింగ్ స్కూల్ను ఆదేశించాలన్న పిటిషన్లపై విచారిస్తూ.. ‘అడ్మిషన్లు నిరంతర ప్రక్రియ కాదు’ అని స్పష్టం చేసింది.