న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్వో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు దేశంలో ప్రత్యేకంగా ట్రయల్స్ అవసరం లేదని చెప్పిన సంగతి తెలుసు కదా. తాజాగా విదేశీ వ్యాక్సిన్లకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వం ఈ రక్షణ కల్పిస్తే.. ఓ టీకా వల్ల ఏవైనా దుష్ఫ్రభావాలు కలిగినప్పుడు సంబంధిత కంపెనీలకు వ్యతిరేకంగా నష్ట పరిహారం కేసులు వేయడానికి వీలుండదు. ఈ కంపెనీలు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంటే వాటికి చట్టపరమైన రక్షణ కల్పించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇతర దేశాలు ఇప్పటికే ఈ రక్షణ కల్పిస్తున్నప్పుడు తాము ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఉంటుందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ముఖ్యంగా ఫైజర్, మోడెర్నా వంటి కంపెనీలు ఈ చట్టపరమైన రక్షణను కోరుకుంటున్నాయి. జులై నుంచి అక్టోబర్ మధ్య 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇస్తామని చెప్పిన ఫైజర్.. ఆ దిశగా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ సంస్థ ప్రత్యేకంగా ఈ చట్టపరమైన రక్షణ కోసం పట్టుబడుతోంది. అమెరికాలాంటి దేశాల్లో ఇప్పటికే ఫైజర్కు ఇలాంటి రక్షణలు ఉన్నాయి. అయితే ఇండియా మాత్రం ఇప్పటి వరకూ ఏ కంపెనీకి ఇలాంటి రక్షణ కల్పించలేదు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని జాతీయ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్ట్ కమిటీ చీఫ్ వీకే పాల్ చెప్పారు.