న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: నిషేధిత ఇస్లామిక్ రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ).. భారత్కు వ్యతిరేకంగా ఒక వర్గం యువతను రెచ్చగొట్టడానికే శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబాల్లో చేరేలా యువతను ప్రోత్సహిస్తున్నదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది. ఇటీవల దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, ఆ సంస్థ నేతల నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా స్వాధీనం చేసుకొన్న పత్రాల్లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐకి సంబంధాలున్నట్టు ఆధారాలు లభించాయని గురువారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. కేంద్రప్రభుత్వ విధానాలను తప్పుగా ప్రచారం చేస్తూ ఒక వర్గం ప్రజల్లో పీఎఫ్ఐ భారీగా అసంతృప్తిని రాజేస్తున్నదని వెల్లడించింది. అటు.. గత జూలై 12న బీహార్లో ప్రధాని మోదీపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ ప్రణాళిక రచించిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్నది.
పుణెలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు
పీఎఫ్ఐ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మహారాష్ట్రలోని పుణెలో కొందరు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయటం కలకలం రేపింది. ఆ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.