న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా దేశాల నడుమ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, అంతకుముందే చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్ను కొనకపోయి ఉంటే దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగేదని భారత పెట్రోలియం, సహజవాయు శాఖ పేర్కొన్నది. ఆ శాఖ విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది.
‘భారత రిఫైనర్లు రష్యన్ ఆయిల్ను కొనకపోయి ఉంటే ఆయిల్ కొరత ఏర్పడేది. దేశంలో రోజుకి 19 లక్షల బ్యారెళ్ల ముడిచమురు అవసరం. ముందే కొనకపోతే ఇప్పుడు ఆయిల్ రేటు బ్యారెల్కు అదనంగా 30-40 డాలర్లు పెరిగేది’ అని భారత పెట్రోలియం శాఖ పేర్కొన్నది. ‘గ్లోబల్గా మార్కెట్లో రోజుకి 10 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్ అవసరం అవుతుంది’ అని తెలిపింది.
‘ఒకవేళ ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (OPEC)’ రోజుకు ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తే ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరుగుతాయి. బ్యారెల్ చమురు ధర 125 నుంచి 130 డాలర్లకు చేరుకుంటుంది. ఒకవేళ భారత్ రోజుకి 19.5 లక్షల బ్యారెళ్ల ఆయిల్ను రెడీ చేసుకుని ఉండకపోతే ఈ ధరలు మరింత పెరిగేవి. అదే జరిగితే మార్కెట్లో గందరగోళం చోటుచేసుకునేది’ అని పెట్రోలియం శాఖ పేర్కొంది.
అదేవిధంగా క్రూడాయిల్ వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉన్నదని, 85 శాతం డిమాండ్ను దిగుమతుల ద్వారానే నెరవేర్చుకుంటున్నామని పెట్రోలియం శాక నివేదికలో వెల్లడించారు. దేశ రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెళ్లని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్కు అతిపెద్ద ఆయిల్ సప్లయర్గా రష్యా ఎదిగిందని, వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు పెట్టడంతో భారత్కు రష్యా తక్కువ రేటుకే క్రూడాయిల్ను సరఫరా చేసిందని వెల్లడించారు.
ప్రస్తుతం దేశ ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతానికి చేరుకుందని, రెండేళ్ల క్రితం ఈ నెంబర్ కేవలం 2 శాతం మాత్రమే ఉందని పెట్రోలియం శాఖ తెలియజేసింది. ఆంక్షల కారణంగా రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకునే సందర్భంగా పేమెంట్స్, లాజిస్టిక్స్ విషయంలో ఇబ్బందులు పడ్డామని పెట్రోలియం మినిస్ట్రీ వెల్లడించింది.