న్యూఢిల్లీ: ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహ సమానత్వాన్ని కల్పించాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. షాదన్ ఫరాసత్ అనే న్యాయవాది ఈ పిటిషన్ గురించి సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు లాయర్ ఫరాసత్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.
ఆ పిటిషన్ గురించి వివరంగా తెలుసుకున్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. కోర్టు శీతాకాల సెలవులు ఉన్నందున, శీతాకాల సెలవుల అనంతరం ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఇటీవల కూడా ఒకే జండర్కు చెందిన రెండు జంటలు ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
ఆ రెండు వేర్వేరు పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రత్యేక వివాహచట్టం కింద వారి వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ఈ మేరకు గత నెల 25న ఈ పిటిషన్లకు సంబంధించి స్పందన తెలుపాలంటూ కేంద్రానికి నోటీసులు కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, కేరళ తదితర హైకోర్టుల్లో సేమ్ సెక్స్ మ్యారేజ్కు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్ల గురించి కూడా సుప్రీంకోర్టు కేంద్రానికి ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నది.