చండీగఢ్: పిల్లలను కనాలని ఒక వ్యక్తికి పొరుగు వారు పదేపదే చెబుతున్నారు. విసుగుచెందిన అతడు ఆగ్రహంతో సుత్తితో కొట్టి వారిని హత్య చేశాడు (Man Hammers Elderly Neighbours). చివరకు అతడు అరెస్ట్ అయ్యాడు. అయితే ఒంటరైన భార్యను కూడా తనతోపాటు అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు. పంజాబ్లోని లూధియానాలో ఈ సంఘటన జరిగింది. 48 ఏళ్ల రాబిన్ అలియాస్ మున్నా, సేలం తబ్రీ ప్రాంతంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఎలక్ట్రిక్ ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నాడు. అతడికి సంతానం కలుగలేదు. ఈ నేపథ్యంలో పిల్లలను కనాలని, లోపం ఉంటే డాక్టర్కు చూపించుకోవాలని పొరుగు ఇంట్లో ఉండే వృద్ధులు పదే పదే చెప్పసాగారు. గురువారం ఉదయం కూడా మున్నా భార్య ఎదుటే ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. దీంతో అతడు ఆగ్రహం చెందాడు. పొరుగింటికి చెందిన 70 ఏళ్ల మున్నా కౌర్, ఆమె భర్తైన 75 ఏళ్ల చమన్ లాల్, 90 ఏళ్ల వయసున్న ఆమె అత్తపై దాడి చేశాడు. సుత్తితో తలపై కొట్టి ఆ ముగ్గురిని చంపాడు.
కాగా, వృద్ధ కుటుంబం ఉంటున్న ఇంటి తలుపులు రెండు రోజులుగా మూసి ఉండటాన్ని పాల వ్యక్తి గమనించాడు. దీని గురించి పొరుగున ఉన్న వారికి శుక్రవారం చెప్పాడు. దీంతో కొందరు గోడ దూకి ఆ ఇంట్లోకి వెళ్లారు. వృద్ధులైన ముగ్గురు హత్యకు గురైనట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుడు మున్నాను శనివారం అరెస్ట్ చేశారు. హత్యకు వినియోగించిన సుత్తి, వృద్ధుల్లో ఒకరికి చెందిన మొబైల్ ఫోన్, కెమెరా ఉన్న బ్యాగ్ను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆధారాలు నాశనం చేసేందుకు మున్నా ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుల హత్య తర్వాత అగరబత్తి వెలిగించి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి వెళ్లిపోయాడని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగితే వారి మృతదేహాలు కాలిపోతాయని, తద్వారా తన నేరం బయటపడదని అతడు భావించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సుత్తిని యూవీ కాంతిలో పరిశీలించగా దానిపై రక్తం మరకలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
కాగా, మున్నా అరెస్ట్తో భార్య ఒంటరి కావడంతో ఆమెను కూడా అరెస్ట్ చేసి తనతోపాటు జైలుకు పంపాలని పోలీసులను అతడు ప్రాథేయపడ్డాడు. మరోవైపు హత్యకు గురైన కౌర్, లాల్ వృద్ధ దంపతుల నలుగురు కుమారులు విదేశాల్లో పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.