న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయెల్ (Arun Goel) షాకింగ్ రాజీనామాపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు చెప్పారు. అరుణ్ గోయెల్ రాజీనామాపై వినిపిస్తున్న అనుమానాలను తోసిపుచ్చారు. ‘అరుణ్ గోయెల్ జట్టులో చాలా విశిష్ట సభ్యుడు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని నేను చాలా ఆనందించా. కానీ ప్రతి సంస్థలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్పేస్ ఇవ్వాలి. దాని జోలికి వెళ్లకూడదు. ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. రాజీనామా గురించి ఆయన్నే అడగాలి’ అని అన్నారు.
కాగా, ఎన్నికల సంఘం (ఈసీఐ)లో చాలా మంచి సంప్రదాయం ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు. అసమ్మతిని నాలుగు గోడల మధ్యే అణచివేయలేమని చెప్పారు. అలాగే ఎన్నికల ప్రణాళిక, నిర్వహణ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని వివరించారు. ఒకరి కంటే ముగ్గురి మేథస్సు ఎల్లప్పుడూ మంచిదని అన్నారు.