ముంబై: శివసేన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సీఎం షిండే వర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతోపాటు నిజమైన శివసేన వారేనని తీర్పు ఇచ్చిన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్పై శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ మండిపడ్డారు. స్పీకర్కు నార్కో టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఊహించిన రీతిలోనే నార్వేకర్ తీర్పు ఇచ్చారు. ఆయనకు నార్కో పరీక్ష చేస్తే అధికార పార్టీ కుట్రలన్నీ బయటపడతాయి’ అని అన్నారు.
కాగా, స్పీకర్ నార్వేకర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేయాలని శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ వ్యంగ్యంగా అన్నారు. ‘నార్వేకర్ తీర్పును ఆదర్శంగా తీసుకుని ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చేయండి. నార్వేకర్ దేశానికి మంచి తీర్పులు ఇస్తారు. నార్వేకర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు స్పీకర్ తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉన్నారని దేశ్ముఖ్ అన్నారు. 40 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరైనా ఎన్నికల్లో ఓడిపోతే వ్యవసాయం చేసుకుంటా అన్న మాటలకు సీఎం షిండే కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. చివరకు ఆయన అదే చేసుకోవాల్సి వస్తుందని దేశ్ముఖ్ వ్యాఖ్యానించారు.