బెంగళూరు: మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. ఎప్పుడూ ఎవరో ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జనాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నలిన్కుమార్ కతీల్ వంతు వచ్చింది. మంగళవారం కర్ణాటకలోని యలబుర్గలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో నళిన్కుమార్ మాట్లాడుతూ.. రామ భజన చేసేవాళ్లే రాష్ట్రంలో ఉండాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘మనమంతా శ్రీరాముడు, హనుమంతుడి భక్తులం. టిప్పు సుల్తాన్ వారసులం కాదు. టిప్పు సుల్తాన్ వారసులను మనం తిప్పి పంపించాం. అందుకే నేనిప్పుడు యలబుర్గ ప్రజలను అడుగుతున్నా.. మీరు హనుమంతుడిని పూజిస్తారా లేదంటే టిప్పు భజన చేస్తారా..?’ అని నళిన్కుమార్ ప్రశ్నించారు. ‘ఆ వెంటనే టిప్పు సుల్తాన్ భజన చేసేవాళ్లను తరిమి కొడతారా..?’ అని అడిగారు.
‘ఒక్కసారి ఆలోచించండి.. ఈ రాష్ట్రం టిప్పు సుల్తాన్ వారసులదా లేదంటే శ్రీరాముడు, హనుమంతుడి భక్తులదా..?’ అని కూడా సభికులకు ప్రశ్న వేశారు. అంతటితో ఆగక ‘టిప్పును ప్రేమించే వాళ్లు ఈ రాష్ట్రంలో ఉండొద్దు. శ్రీరాముడి భజనలు, హనుమంతుడి ఉత్సవాలు జరుపుకునేవారు మాత్రమే ఇక్కడుండాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, నళిన్ కతీల్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.