పనాజీ: బీజేపీ అవినీతితో గోవా ప్రజలు విసిగిపోయారని ఏఐసీసీ గోవా ఇంచార్జి దినేష్ గుండూరావు విమర్శించారు. నేటి బీజేపీ గోవా యూనిట్, ఫిరాయించిన వారందరితో కూడిన పాత కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. అవినీతిపరులంతా బీజేపీ వెంటే ఉన్నారని ఆరోపించారు. గోవా మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాటలు వింటే బీజేపీ ప్రభుత్వంలో ఎంత అవినీతి ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
గోవాకు కాంగ్రెస్, గాంధీ కుటుంబం చేసిన సహకారం గురించి కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలియదని గుండూరావు అన్నారు. గోవాకు రిఫరెండం, మహారాష్ట్రతో కలిసి ఉండాలా వద్దా అనే అభిప్రాయ సేకరణ అవసరమని ఇందిరా గాంధీ నిర్ణయించారని తెలిపారు. అలాగే గోవాకు రాష్ట్ర హోదాను రాజీవ్ గాంధీ ఇచ్చారని గుర్తు చేశారు.