Omicron | కరోనా సమయంలో ఢిల్లీ ఘోరంగా తల్లడిల్లింది. కేసుల తీవ్రతతో సతమతమైంది. దీంతో స్థానికులు కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటించారు. దీంతో అక్కడ కేసులు తగ్గాయి. తాజాగా… ఒమిక్రాన్ కేసులు ఢిల్లీలో చాపకింద నీరులా విస్తరించాయి. అయినా… ప్రజలు ఏమాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు. మార్కెట్ల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. దీంతో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. ఢిల్లీలోని సరోజినీ నగర్ మార్కెట్లో ప్రజలు వ్యవహరించిన తీరును చూసి పోలీసులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సరోజినీ నగర్ మార్కెట్లో ఆదివారం రోజున ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా గుమిగూడారు. మాస్కులు కూడా ధరించలేదు. కనీసం భౌతికదూరం కూడా పాటించకుండానే మార్కెట్లో కలియ తిరిగారు. మార్కెట్లో ఉన్న రద్దీతో అక్కడి ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
సరోజినీ నగర్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితిని చూసి పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అక్కడ బారికేడ్లను ఏర్పరిచారు. వచ్చి, పోయే దారిని నియంత్రించడానికి పడరాని పాట్లు పడ్డారు. ప్రజలను కొద్ది కొద్దిగా పంపించి, ఆ తర్వాత బారికేడ్ వేసి, ఆ తర్వాత మరికొంత మంది వెళ్లడానికి అనుమతించారు. అయినా రద్దీ ఏమాత్రం కంట్రోల్ కాలేదు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా ప్రజలు పట్టనట్టే ఉండిపోయారు. దీంతో పోలీసులు వ్యక్తిగతంగా వారి దగ్గరికి వెళ్లి,మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేయడంతో, అప్పుడు మాస్కులు ధరించడం ప్రారంభించారు. అయితే, ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసులను చూసి మాస్కులు ధరించి, మార్కెట్లోకి వెళ్లగానే మాస్కులు తీసేయడం తమకు కనిపించిందని పోలీసులు వాపోయారు. ఒమిక్రాన్ వ్యాప్తి జరగకుండా తామెంత ప్రయత్నిస్తున్నా, ప్రజలు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసు యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.