న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మెన్ సామ్ పిట్రోడో(Sam Pitroda) మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వారసత్వ పన్ను గురించి కామెంట్ చేసి వివాదంలో ఇరుక్కున్న ఆయన.. తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దేశ ప్రజలపై అనుచిత కామెంట్ చేశారు. దక్షిణ భారతంలో ఉన్న వాళ్లు ఆఫ్రికన్లుగా, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు ఆరబ్బులుగా కనిపిస్తున్నారని పిట్రోడా వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకర వాతావరణంలో బ్రతికారని, అక్కడక్కడ చిన్నచిన్న స్పర్థలు తప్ప ఏమీలేవని ఆయన అన్నారు. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ.. భారత్ భిన్నత్వ దేశమని, కానీ అందరూ కలిసికట్టుగా ఉంటారని, తూర్పున ఉన్నవాళ్లు చైనీయులుగా, పశ్చిమంలో ఉన్నవాళ్లు అరబ్బులుగా, ఉత్తరంలో ఉన్నవాళ్లు శ్వేతజాతీయులుగా, దక్షిణంలో ఉన్న వాళ్లు బహుశా ఆఫ్రికన్లుగా కనిపిస్తారని పిట్రోడా పేర్కొన్నారు. భారత దేశ ప్రజలు భిన్న భాషలను, మతాలను, ఆహారాన్ని, ఆచారాలను గౌరవిస్తారన్నారు. భారత్లో ప్రతి ఒక్కరికీ స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో కాంప్రమైజ్ అవుతుంటారని ఆయన తెలిపారు.