న్యూఢిల్లీ: ఇతని పేరు పెరల్ కపూర్. వయసు 27 ఏళ్లు. భారత యువ బిలియనీర్(Youngest Billionaire)గా ఈయన రికార్డుల్లోకెక్కాడు. గౌతమ్ అదానీ, ముఖేశ్ అంబానీ బాటలోనే ఈయన ప్రయాణిస్తున్నాడు. చాలా తక్కువ సమయంలోనే పెరల్ కపూర్ కోటీశ్వరుడయ్యాడు. 2023 మే నెలలో జైబర్ 365 అనే స్టార్టప్ను ఈయన మొదలుపెట్టాడు. వెబ్3, ఏఐ ఆధారిత ఓఎస్ స్టార్టప్ కంపెనీ అది. రిటేల్ సెక్టార్లో ఈ స్టార్టప్ ఓ సంచలనం సృష్టించింది. కేవలం మూడు నెలల్లోనే యూనికార్న్ స్టాటస్ను సంపాదించింది. బిలియన్ల డాలర్లు విలువ చేసే కంపెనీని యూనికార్న్గా గుర్తిస్తారు.
జైబర్ 365 కంపెనీ ప్రధాన కార్యాలయం లండన్లో ఉన్నది. గుజరాత్లోని అహ్మాదాబాద్ నుంచి దీని ఆపరేషన్స్ జరుగుతుంటాయి. భారత్తో పాటు ఆసియాలో వేగంగా వృద్ధి చెందుతున్న యూనికార్న్ కంపెనీగా దీనికి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ సుమారు1.2 బిలియన్లు డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.9840 కోట్లు అన్నమాట.
పెరల్ కపూర్కు జైబర్ 365 కంపెనీలో 90 శాతం షేర్లు ఉన్నాయి. అంటే తాజా సమాచారం ప్రకారం ఆ కంపెనీకి చెందిన సుమారు 9129 కోట్లు ఆయన వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ స్టార్టప్కు 100 మిలియన్ల డాలర్ల నిధులు వచ్చాయి. దాంట్లో 8.3 శాతం పెట్టుబడులు ఎస్రామ్, ఎంరామ్ గ్రూపు నుంచ్చే వచ్చాయి.
లండన్లోని క్వీన్ మేరి యూనివర్సిటీలోని ఎంఎస్సీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో కపూర్ గ్రాడ్యుయేట్ అయ్యారు. వెబ్3 టెక్నాలజీతో కపూర్ను ఓ గొప్ప ఆవిష్కర్తగా గుర్తిస్తారు. జైబర్ 365 స్టార్ట్ చేయడానికి ముందు ఏఎంపీఎం స్టోర్లో ఫైనాన్సియల్ అడ్వైజర్గా, ఆంటైర్ సొల్యూషన్స్లో బిజినెస్ అడ్వైజర్గా పనిచేశాడు. బ్లాక్చైన్, ఏఐ, సైబర్సెక్యూర్టీ లాంటి టెక్నాలజీలకు భవిష్యత్తు ఉంటుందని పెరల్ కపూర్ తెలిపారు.