సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గోవాకు చెందిన డ్రగ్స్ డాన్లపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. గోవాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ.. మాఫియా కింగ్ పిన్లుగా వ్యవహరించిన ఎడ్విన్, ప్రితీశ్ నారాయణ బోర్కర్పై పీడీ యాక్టు విధించారు. ఆగస్టు నెలలో హెచ్న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) నిర్వహించిన ఆపరేషన్లో గోవాకు చెందిన ప్రితీశ్ నారాయణ బోర్కర్ అలియాస్ బాబును అరెస్టు చేశారు. బోర్కర్ను విచారించడంతో భారీ నెట్వర్క్ బయటపడింది. తుకారాం సల్ గవల్కర్, వికాస్ నాయక్, రమేశ్ చౌహాన్, స్టీవ్, ఎడ్విన్ న్యూన్స్, సంజ గవల్కర్ వంటి ప్రధాన డ్రగ్ మాఫియా కింగ్పిన్ల పేర్లు బయటకు వచ్చాయి. వీరిద్వారానే డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో ప్రితీశ్ నారాయణ వెల్లడించారు. అతడి నెట్వర్క్లో దాదాపు 600 మంది వినియోగదారులు ఉన్నట్టు గుర్తించారు. అందులోని కొంతమంది వినియోగదారులు డ్రగ్స్ విక్రయించే ఏజెంట్లుగా కూడా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ప్రితీశ్ నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రాబట్టిన సమాచారంతో బయటపడ్డ డ్రగ్ మాఫియా నెట్వర్క్పై హెచ్న్యూ రెండు నెలల పాటు ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ వస్తున్నారు. అందులో ప్రధానంగా ఎడ్విన్ను అరెస్టు చేశారు. అతడిని అరెస్టు చేసేందుకు హెచ్న్యూ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. నమోదైన కేసులు, డ్రగ్స్ సరఫరాతో బోర్కర్, ఎడ్విన్ సమాజానికి చేస్తున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకున్న హైదరాబాద్ పోలీసులు వారిద్దరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.