బెంగళూరు, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే ‘పే సీఎం’ ఆందోళనతో సతమతమవుతున్న కర్ణాటక సీఎంకు మరో సెగ తగిలింది. చెరుకుకు రూ.4,500 మద్దతు ధర కల్పించాలని ఆ రాష్ట్ర రైతులంతా కలిసి ‘పే ఫార్మర్’ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో టన్ను చెరుకుకు రూ.2,500-రూ.2,800గా ఉన్నది. దీంతో రైతులకు కనీస మద్దతు ధర అమలు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. కర్ణాటక రాజ్య రైతు సంఘం నాయకుడు దర్శన్ పుట్టణ్ణయ్య నాయకత్వంలో పే ఫార్మన్ ఆందోళన ప్రారంభమైంది. ‘పే ఫార్మర్ యాక్సెప్టెడ్ హియర్ రుపీస్ 4,500 పర్ టన్ ఫర్ షుగర్ కేన్’ అని తలపాగా చుట్టుకున్న రైతు బొమ్మ క్యూఆర్ కోడ్తో ఉన్న పత్రాలను రాష్ట్రవ్యాప్తంగా వాహనాలు, గోడలకు అతికిస్తున్నారు.
పల్లెల్లో ఊరేగింపులు చేపట్టి నినదిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని దర్శన్ హెచ్చరించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని చకెర మిల్లులే రైతులకు రూ. 200 కోట్ల బకాయిలు ఉన్నాయని చెరుకు రైతుల సంఘం నేత కురబూరు శాంతకుమార్ తెలిపారు. బకాయిలు తీర్చక, చెరకు కొనుగోలు ధరలు పెంచకపోతే ఎలా అని నిలదీశారు. కర్ణాటకలో 71 చకెర మిల్లులు ఉన్నాయి. వీటిలో అత్యధిక కర్మాగారాలు బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి బంధువులవే.
చెరుకు కొనుగోలు ధరను పెంచేందుకు వారు ఒప్పుకోవటం లేదు. చర్యలు తీసుకొంటే వారి ఆగ్రహానికి గురవుతానని బొమ్మై కూడా రైతుల సమస్యపై స్పందించటం లేదు. అటు.. వచ్చే మార్చి, ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు పది జిల్లాల్లో అంటే ఎనభై నియోజకవర్గాల్లో చెరుకు రైతులు రాజకీయాలను ప్రభావితం చేస్తారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యను పరిష్కరించకపోతే ఎన్నికల ఫలితంపై ప్రభావం పడుతుందని పార్టీ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. దీంతో బొమ్మై పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది.
చెరువును పూడ్చి.. మంత్రికి జాగా
చెరువుల కబ్జాను సహించేది లేదన్న ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అశోక్కే చెరువులో జాగా ఉండటం గమనార్హం. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ నగరంలో దాదాపు 26 చెరువులను పూడ్చివేసి లే అవుట్లు చేసింది. వాటిలో పలువురు ప్రజాప్రతినిధులకు ఇంటి జాగా ఉన్నది. ఎంపీ, ఎమ్మెల్యే కోటాలో ఈ జాగాను ప్రభుత్వం వీరికి కేటాయించింది. మంత్రి అశోక్ హెచ్బీఆర్ లేఅవుట్లో (హెణ్ణూరు చెరువు) 2007లోనే 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని పొందారు. మరో మంత్రి గోవింద కార్జోళ కూడా 1998లో ఆర్ఎంవీ రెండో దశ లేఅవుట్లో (గెద్దలహళ్లి చెరువు) 4,000 చదరపు అడుగుల జాగాను పొందారు. మంత్రి డీ సుధాకర్, అసెంబ్లీలో విపక్షనేత సిద్ధరామయ్య, డీకే శివకుమార్, యెడ్డియూరప్ప కుమారుడు రాఘవేంద్ర, సహా పలువురు ఎమ్మెల్యేలకు చెరువుల్లోనే స్థలాలు ఉన్నాయి.