Pawan Singh: వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ పడేది, లేనిది కాలమే చెబుతుందని భోజ్పురి నటుడు, గాయకుడు, బీజేపీ నేత పవన్ సింగ్ చెప్పారు. సోమవారం ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై బయటికి వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ అధ్యక్షుడితో మాట్లాడానని, భవిష్యత్తులో ఏం జరిగినా మంచే జరగాలని పవన్ సింగ్ వ్యాఖ్యానించారు.
కాగా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ పడబోయే 195 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను బీజేపీ గత శనివారం వెల్లడించింది. ఆ జాబితాలో పవన్ సింగ్ పేరు కూడా ఉంది. పశ్చిమబెంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శత్రుఘ్ను సిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్న అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఆయనను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
అయితే, ఈ ప్రకటన వెల్లడైన మరుసటి రోజే (ఆదివారం) పవన్ సింగ్ తాను అసన్సోల్ నుంచి పోటీ చేయబోనని ఒక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఇవాళ స్వయంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి మాట్లాడారు. నడ్డాతో భేటీ అనంతరం బయటికి వచ్చిన ఆయనను వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? అని ప్రశ్నించగా కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు.
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేనిది కాలమే చెబుతుంది. ఏదైనా ఉంటే నేనే మీకు చెబుతా. ప్రస్తుతానికి ఈ విషయాన్ని వదిలేయండి’ అని పవన్ సింగ్ చెప్పారు. అసన్సోల్ లోక్సభ స్థానాన్ని తిరస్కరించడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. కాగా, పవన్ సింగ్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంపై టీఎంసీ విమర్శలు చేస్తోంది. మహిళలను కించపర్చేలా ఆయన పాటలు ఉన్నాయని అందుకే పోటీకి భయపడ్డాడని ఎద్దేవా చేసింది.