Congress : కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి చెందిన సీనియర్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharur) మరోమారు తన సొంత పార్టీలోనే తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారారు. జీ-7 సదస్సు వేదికగా పశ్చిమాసియా (West Asia) ఉద్రిక్తతల నడుమ భారతీయ వాణిజ్య నౌకల నావికుల భద్రత గురించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను శశిథరూర్ ప్రశంసించడం ఇందుకు కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన బహిరంగ, వ్యక్తిగత సమావేశాల్లో పౌర నావికులను సైనిక దాడుల లక్ష్యాలుగా చేసుకోకూడదనే స్పష్టమైన సందేశాన్ని మోదీ బలంగా వినిపించారని థరూర్ కొనియాడారు.
అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రచార విభాగం అధినేత పవన్ ఖేరా స్పందిస్తూ.. శశి థరూర్పై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విదేశాంగ శాఖ విడుదల చేసిన భారత్-అమెరికా అధికారిక ఉమ్మడి ప్రకటనలో ఒమన్ గల్ఫ్లో అమెరికా దళాల దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన ఉదంతం గురించి ప్రస్తావన లేదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీపై శశి థరూర్కున్న ఆరాధన భౌతిక ప్రపంచ సరిహద్దులను దాటిపోయిందని, అందుకే మోదీ అనని మాటలను కూడా ఆయన వినగలుగుతున్నారని పవన్ ఖేరా ఎద్దేవాచేశారు.
దీనికితోడు విపక్ష నేత రాహుల్ గాంధీ అభిప్రాయాలకు భిన్నంగా థరూర్ ప్రభుత్వం వైపు మాట్లాడటంపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగిన బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. కాంగ్రెస్ అంతర్గత విభేదాలను ఎండగడుతూ రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే శశి థరూర్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తడంతో శశి థరూర్ ఎక్స్ వేదికగా దీటుగా బదులిచ్చారు. దేశ పౌరుల ప్రాణాల రక్షణ, నావికుల భద్రత వంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వివాదంగా మార్చడం అత్యంత విచారకరమని ఆయన అన్నారు.
ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఈ అంశంలో రాజకీయం చేయడం కంటే పౌరుల క్షేమం కోసం అందరూ ఏకమవ్వాలని హితవు పలికారు. అంతేకాకుండా తాను ప్రింట్ మీడియాలో వచ్చిన కథనాలు, గూగుల్ జెమిని సారాంశాల ఆధారంగానే నిజాలు మాట్లాడానని, తన జీవితంలో ఎప్పుడూ వాస్తవాలను వక్రీకరించలేదని థరూర్ సమర్థించుకున్నారు.