పవన్హన్స్ విక్రయంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పవన్హన్స్లోని 51 శాతం వాటాను కేవలం రూ.211.14 కోట్లకు స్టార్ 9 మొబిలిటీ కన్సార్టియానికి కేంద్రప్రభుత్వం విక్రయించడం తెలిసిందే. ఈ కన్సార్టియంలో బిగ్ చార్టర్, మహారాజా ఏవియేషన్తో పాటు అల్మాస్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్ ఎస్పీసీ సంస్థ కూడా ఉన్నది. కేమన్ ఐల్యాండ్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థపై ఆర్థిక నేర అభియోగాలు ఉన్నాయి. జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్సన్ నంగాగ్వా ప్రభుత్వం పడిపోకుండా కాపాడటానికి నంగాగ్వా సలహాదారుడు, వ్యాపారవేత్త కుడాక్వషే తగ్విరేయి.. అల్మాస్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్ ఎస్పీసీ అనే డొల్ల కంపెనీని అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు వాడుకొన్నాడు. కుడాక్వషే తగ్విరేయిపై అమెరికా పూర్తిస్థాయి ఆంక్షలు విధించింది.
కుంభకోణంలో పాల్గొన్న అల్మాస్ వంటి సంస్థలకు ఆర్థిక పరిమితులు పెట్టింది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అక్రమ లావాదేవీలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలకు ప్రభుత్వం తరఫున రుణాలు మంజూరు చేయకూడదు. ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలను ఎట్టిపరిస్థితుల్లో విక్రయించకూడదు. అయినప్పటికీ, ఇవేమీ పట్టించుకోని మోదీ సర్కారు.. షెల్ కంపెనీ అయిన అల్మాస్ ఉన్న కన్సార్టియానికి ‘పవన్హన్స్’ను ధారాదత్తం చేసింది. నిబంధనల ప్రకారం.. భారత సంస్థను కొనుగోలు చేసే కంపెనీ భారత్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి. అయితే, అల్మాస్ కేమన్ ఐల్యాండ్స్లో కార్యకలాపాలు సాగిస్తున్నది. ఇది నిబంధనలకు విరుద్ధం.
ఎస్బీఐ కూడా చెప్పింది..
‘వేల కోట్ల విలువైన సంస్థను కేవలం రూ. 211 కోట్లకు ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా అప్పగిస్తారు?’ పవన్హన్స్ విక్రయం జరగ్గానే ప్రతీఒక్కరినీ తొలిచేసిన ప్రశ్న ఇది. అయితే, సంస్థ విలువ మహా అయితే రూ. 400 కోట్లు మాత్రమేనని కేంద్రప్రభుత్వ వర్గాలు బుకాయించే ప్రయత్నాలు చేశాయి. అయితే, దీనిపై వైమానిక రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్హన్స్ ఆధీనంలో ఇప్పటికే 42 హెలికాప్టర్లు ఉన్నాయని, వాటి విలువ రూ. 2,898 కోట్లు అని పేర్కొన్నారు. నోయిడా, ముంబైలో కంపెనీకి పెద్దయెత్తున స్థిరాస్తులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. కాగా 2020 డిసెంబర్ 7లో ఎస్బీఐ క్యాపిటల్ లిస్ట్ ఇచ్చిన నివేదికను విశ్లేషిస్తే, నిపుణులు చెప్పిన వివరాలు నిజమని తెలుస్తున్నది. ఆ నివేదిక ప్రకారం.. ముంబైలోని ప్రధాన ప్రాంతాల్లో కంపెనీకి 243 ఫ్లాట్లు/క్వార్టర్స్ (ఒక్కోటి కనీసం రూ. 3 కోట్లు), నోయిడాలో 37,140 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్పొరేట్ ఆఫీస్ (రూ. 37 కోట్లు) ఉన్నాయి. ఈ రెండు ఆస్తుల మొత్తం విలువే రూ. 767 కోట్లు అని నివేదిక లెక్కగట్టింది. దీన్నిబట్టి వేల కోట్ల ‘పవన్హన్స్’ను అవినీతి కేసుల్లో కూరుకుపోయిన కంపెనీలకు కేంద్రం కారుచౌకగా తెగనమ్మినట్టు రూఢీ అవుతున్నది.
పవన్హన్స్ కొన్ని ప్రత్యేకతలు
ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ల కంపెనీ.
చాపర్ నిర్వహణలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలు సొంతం.
యుద్ధ సమయాల్లో ఆర్మీకి, విపత్తు సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ధ్రువ్ హెలికాప్టర్ల సరఫరా.
ప్రఖ్యాత ఎయిర్బస్ హెలికాప్టర్ సెంటర్ (యూరోకాప్టర్)లో మరమ్మతులకు అనుమతి పొందిన అత్యంత తక్కువ కంపెనీల్లో ఒకటి.