న్యూఢిల్లీ: ఫూటుగా మద్యం సేవించి ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో శంకర్ మిశ్రా జైలు నుంచి విడుదలు కాబోతున్నాడు.
కాగా, గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఈ ఘటనపై బాధితురాలు ఈ ఏడాది జనవరి 6న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు శంకర్ మిశ్రాను అరెస్ట్ చేశారు.
అనంతరం అతడిని పటియాలా హౌజ్ కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన దగ్గర డబ్బులు తీసుకుని రాజీ చేసుకుందని, ఇంకా డబ్బులు కావాలనడంతో తాను నిరాకరించానని, అందుకే నెల రోజుల తర్వాత కేసు పెట్టిందని నిందితుడు ఆరోపించాడు. ఆ తర్వాత నిందితురాలే అనారోగ్యం కారణంగా మూత్రం పోసుకుని తనపై కేసు పెట్టిందని మరో ఆరోపణ చేశాడు. వీటిపై కోర్టులో విచారణ జరుగుతున్నది.