చండీగఢ్: పంజాబ్లోని పాటియాలాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడ్ని మొహాలీలో అరెస్ట్ చేసినట్లు పాటియాలా ఐజీ ముఖ్విందర్ సింగ్ చనియా మీడియాకు తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టి పోలీస్ రిమాండ్ కోరుతామని చెప్పారు. జిల్లాలోని రాజపురాకు చెందిన బర్జిందర్ సింగ్ పర్వానా పాటియాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు కీలక సూత్రధారి అని తెలిపారు. హరీష్ సింగ్లా సహచరుడు శంకర్ భరద్వాజ్తోపాటు జగ్గీ పండిట్ను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
కాగా, శివసేనకు చెందిన పంజాబ్ విభాగం పంజాబ్ శివసేన (బాల్ ఠాక్రే) పాటియాలాలో శుక్రవారం యాంటీ ఖలిస్థాన్ మార్చ్ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు, నిహాంగ్స్ మరో ర్యాలీ చేపట్టారు. నగరంలోని కాళీమాత ఆలయం వద్ద రెండు గ్రూపులు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వడంతోపాటు కత్తులు దూసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఘర్షణల నేపథ్యంలో శనివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతోపాటు సాయంత్రం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
మరోవైపు ఈ అల్లర్లకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పాటియాలా ఎస్ఎస్పీ దీపక్ పారిక్ శనివారం తెలిపారు. అరెస్టైన వారిలో శివసేన నేత హరీష్ సింగ్లా, కుల్దీప్ సింగ్ దంతాల్, దల్జీత్ సింగ్ ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వీడియో సాక్ష్యాలను పరిశీలించామని, దీంతో మరింత మంది నిందితులను అరెస్ట్ చేస్తామని అన్నారు. శనివారం సాయంత్రానికి 25 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏ ఒక్కరినీ వదలబోమని, ప్రతి నిందితుడిని అరెస్టు చేస్తామని దీపక్ పారిక్ స్పష్టం చేశారు.