Late train welcome | మన దేశంలో రైళ్లను ఇప్పుడిప్పుడే సరైన సమయానికి నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినా అక్కడక్కడ కాస్తో కూస్తో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు కొంచెం లేటయినా ఓపికగా ఎదురు చూస్తుంటాం. అయితే, ఇక్కడ ప్రయాణికులు మాత్రం గంటో, రెండు గంటలో కాకుండా ఏకంగా 9 గంటలు రైలు కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. చివరకు రావడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. ఆనందంతో డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. చివరకు రైళ్లోకెక్కి కూర్చుని గమ్యం చేరడం గురించి ఆలోచిస్తున్నారు.
ఇంతలో వారి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. మార్గమధ్యంలోని ఓ స్టేషన్లో రైలు ఇంజిన్లో లోపం తలెత్తింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది చాలా కష్టపడ్డారు. నాలుగు గంటలపాటు వేచి ఉన్నా లోపం సరికాకపోవడంతో చేసేదేం లేక కాలికి బుద్ధి చెప్పారు. అదే రైలు పట్టాల వెంబడి నడుస్తూ ప్రయాణికులంతా తమతమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. మిణుకుమంటున్న ఆశతో కొందరు అదే రైలులో ఎదురుచూస్తూ కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
Our train got late by 9 hours. This is how people reacted when it arrived. pic.twitter.com/8jteVaA3iX
— Hardik Bonthu (@bonthu_hardik) November 27, 2022
మహారాష్ట్రలోని గోండియా నుంచి చంద్రాపూర్లోని బల్లార్షాలో రైలు నిలిచిపోయింది. అంతకు 4 గంటల ముందు ఇదే రైలును గోండియా స్టేషన్లో చప్పట్లు కొట్టి మరీ ప్రయాణికులు స్వాగతించారు.