Mumbai | ముంబై : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ మారిషస్కు చెందిన ఓ విమానంలో శనివారం ఉదయం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు రన్వేపై ఉన్న విమానంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువురు చిన్నారులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి ఎంకే 749 విమానం శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు మారిషస్ బయల్దేరాల్సి ఉంది. ఈ క్రమంలో తెల్లవారుజామున 3:45 గంటల నుంచి ప్రయాణికులందరిని విమానంలోకి ఎక్కించారు. అయితే టేకాఫ్ చేస్తుండగా ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఆ విమానాన్ని రన్వేపైనే ఉంచారు. కానీ ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5 గంటల పాటు ప్రయాణికులందరూ విమానంలోనే ఉండాల్సి వచ్చింది.
ఈ సమయంలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికుల్లోని పలువురు చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే వారిని కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై ఎయిర్పోర్టు అధికారులు కానీ, ఎయిర్ మారిషస్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.