న్యూఢిల్లీ: విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అస్సాం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో గురువారం ఈ సంఘటన జరిగింది. ఇండిగో విమానం 6ఈ 2037 అస్సాంలోని దిబ్రూఘడ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి పొగలు, నిప్పురవ్వలు రావడాన్ని క్యాబిన్ క్రూ సిబ్బంది గమనించారు. వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో ఆ విమానం గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులు లేదా క్రూ సిబ్బందికి ఏమీ జరుగలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు.
మరోవైపు ఇండిగో విమాన సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘దిబ్రూఘడ్-ఢిల్లీ 6ఈ 2037 విమానంలో మొబైల్ ఫోన్ బ్యాటరీ అసాధారణంగా వేడెక్కిన సంఘటన జరిగింది. అన్ని ప్రమాదకర సంఘటనలను నివారించడానికి శిక్షణ పొందిన సిబ్బంది పరిస్థితిని చాలా త్వరగా చక్కదిద్దారు. విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది లేదా ఆస్తికి ఎలాంటి హానీ జరుగలేదు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.