Python | చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ సంఖ్యలో సరీసృపాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రోజు కౌలలంపూర్ నుంచి మహమ్మద్ మొయినుద్దీన్ అనే ప్రయాణికుడు తిరుచ్చి ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. మొయినుద్దీన్ను అనుమానాస్పదంగా కనిపించడంతో.. అతని లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద 47 కొండచిలువలు ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఎయిర్పోర్టుకు చేరుకుని 47 కొండచిలువలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఈ కొండచిలువలను మలేషియా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొయినుద్దీన్ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.