Indigo Flight | విమానంలో గాలిలో ఉండగానే ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకొని మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ముంబయి నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో విమానాన్ని నాగ్పూర్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సమాచారం ప్రకారం.. మరణించిన ప్రయాణికుడు సోమవారం రాత్రి 8 గంటలకు ముంబయి నుంచి రాంచీకి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. విమానం గాలిలో ఉన్న సమయంలో రక్తంతో వాంతులు చేసుకున్నాడు. దీన్ని గమనించిన సిబ్బంది పైలట్కు సమాచారం ఇచ్చారు.
ఆ తర్వాత పైలట్ ఉన్నతాధికారులను సంప్రదించి విమానాన్ని నాగ్పూర్కు మళ్లించాడు. అక్కడ అత్యవసర ల్యాండింగ్ చేసి.. సదరు ప్రయాణికుడి నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, అప్పటికే సదరు ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ముంబయి నుంచి రాంచీకి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 5093 విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా నాగ్పూర్కు మళ్లించారని, వాంతులు చేసుకున్న ప్రయాణికుడిని వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో ఎయిర్లైన్స్ పేర్కొంది. అయితే, సదరు ప్రయాణికుడి మృతి కారణాలు తెలియరాలేదని, పోస్ట్మార్టం నివేదిక తర్వాతనే కారణాలు తెలుస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.