న్యూఢిల్లీ, మే 30: గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎయిరిండియా విమానంలో సోమవారం చోటుచేసుకొన్నదని ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ప్రయాణికుడు మొదట సిబ్బందిపై దూషణకు దిగాడని, ఆ తర్వాత ఒకరిపై దాడి చేశాడని ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత కూడా అతని ప్రవర్తన అలాగే కొనసాగిందని, దీంతో పోలీసులకు అప్పగించినట్టు వెల్లడించారు.
విమానంలో ఇటువంటి ఘటనలు ఇటీవల తరచుగా చోటుచేసుకొంటున్నాయి. ఇద్దరు మహిళా సిబ్బందిపై దాడి చేసినందుకు ఎయిరిండియా ఈ నెల మొదట్లో ఓ ప్రయాణికుడిపై రెండేండ్ల పాటు ప్రయాణ నిషేధం విధించింది. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించే వారిపై ప్రయాణ నిషేధం విధించొచ్చని డీజీసీఏ నిబంధనలు చెబుతున్నాయి.