Priyanka Gandhi | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఆయన చేరిక ప్రయత్నాలు విఫలం కావడంపై నోరు విప్పారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరాల్సిందని అంగీకరించారు. కానీ అది జయప్రదం కాలేదన్నారు. దీనికి బహుళ కారణాలు ఉన్నాయన్నారు. కొంత వరకు తాము కారణం కావచ్చునని శనివారం ఓ కార్యక్రమంలో చెప్పారు. కానీ అందుకు కారణాలపై పూర్తి వివరాలను వెల్లడించడానికి ప్రియాంక గాంధీ వద్రా నిరాకరించారు. కొన్ని అంశాలపై విస్తృత ప్రాతిపదికన అంగీకారం కుదిరే అవకాశం లేదన్నారు. బయటి వ్యక్తిని కాంగ్రెస్లోకి తీసుకోవడానికి అయిష్టత ఉందన్న ప్రచారాన్ని నిరాకరించారు. ప్రశాంత్ కిశోర్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయమై అయిష్టత ఉంటే, చర్చోప చర్చలు జరిగేవి కాదని చెప్పారు.
గతేడాది పలు దఫాలు కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోనూ, రాహుల్, ప్రియాంకలతోనూ పలు దఫాలు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ ఇంటికి ప్రశాంత్ కిశోర్ వెళ్లిన ఫోటోలు భారీ స్థాయిలో ఊహాగానాలకు దారి తీశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరినట్లేనని అంతా భావించారు. కానీ, మధ్యలోనే అర్ధంతరంగా చర్చలు విఫలం కావడంతో రాహుల్ గాంధీపై ప్రశాంత్ కిశోర్ పదేపదే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గత పదేండ్లలో కాంగ్రెస్ పార్టీ 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిందని వ్యాఖ్యానించారు.