న్యూఢిల్లీ : భారతదేశ విభజన చారిత్రాత్మక తప్పిదమని, కాశ్మీరీలే కాకుండా ముస్లిం సమాజం దాని భారాన్ని భరించాల్సి వచ్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ జాతీయ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశ విభజనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ఆయన.. విభజన జరగకపోయి ఉంటే ఇరువర్గాలు శాంతియుతంగా సహజీవనం చేయడంతో పాటు దేశం మరింత శక్తివంతంగా ఉండేదన్నారు.
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది చాలా మంచి చర్య. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశానికి ప్రధానమంత్రి అయినందున అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. అనేక మతాలు ఉన్నాయి’ అన్నారు. హిందూ, హిందుత్వంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై అబ్దుల్లా స్పందిస్తూ.. ‘మతాలు ఎప్పుడూ చెడ్డవి కావు. మనుషులు’ అని అన్నారు.
‘హిందూ కో అస్లీ హిందూ బన్నా చాహియే’ (హిందువు నిజమైన హిందువుగా మారాలి), వారి మతాన్ని అనుసరించాలని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఆదివారం, రక్షణ మంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ మత ప్రాతిపదికన దేశ విభజన ‘చారిత్రక తప్పిదం’ అని అన్నారు. బంగ్లాదేశ్ విముక్తికి సాయుధ బలగాలు అందించిన సహకారాన్ని స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన ‘స్వర్ణిమ్ విజయ్ పర్వ్’ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా ఇండియా గేట్ లాన్స్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.