ఛండీగడ్ : పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూ మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీప్ సిద్ధూ సోదరుడు సుర్జీత్ ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీప్ సిద్ధూ ప్రయాణిస్తున్న ట్రక్కును ఢీకొట్టిన విషయం తెలిసిందే. ట్రక్కు డ్రైవర్ సడెన్ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని సుర్జీత్ ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులు 279, 304ఏ సెక్షన్ల కింద ట్రకు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.
హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో సిద్ధూ మృతి చెందారు. సంబంధిత ట్రక్కు డ్రైవర్ను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు ఎస్పీ రాహుల్ శర్మ తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దీప్ సిద్ధూ కారులో పాక్షికంగా వినియోగించిన మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. విసెరా నమూనా సేకరించామని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు.
కాగా, ఇవాళ సిద్ధూ పోస్టుమార్టం పూర్తి కాగా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. గతేడాది జనవరిలో రిపబ్లిక్ డే రోజు జరిగిన హింసాకాండ కేసులో బెయిల్పై బయటకు వచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఎర్రకోట వద్దకు చేరగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కవాతుకు అనుమతించిన మార్గంలో కాకుండా మరోమార్గంలో వచ్చేలా దీప్ సిద్ధూ రైతులను రొచ్చగొట్టినట్లు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఆర్ఐలో పేర్కొన్నారు.