కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన స్నేహితురాలు అర్పితా ముఖర్జీలకు కోల్కతాలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆగస్ట్ 18 వరకు వారిద్దరూ జైలులో ఉండనున్నారు. బెంగాల్ ప్రభుత్వ, అనుబంధ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీలో జరిగిన భారీ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టింది. విద్యా శాఖ మంత్రి పదవి నుంచి తొలగించిన పార్థా ఛటర్జీకి కోట్లలో ముడుపులు ముట్టినట్లు ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో సోదాలు చేసింది. ఆమె ఇళ్లలో సుమారు 50 కోట్ల నగదు, భారీగా బంగారం, విదేశీ కరెన్సీ, ఆస్తుల పత్రాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఈడీ, జూలై 23న వారిద్దరినీ అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో ఐదు రోజుల పాటు ప్రశ్నించింది.
కాగా, శుక్రవారంతో కస్టడీ ముగియడంతో పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలను ప్రత్యేక కోర్టులో ఈడీ ప్రవేశపెట్టింది. కొత్తగా వెలుగు చూసిన అంశాలపై వారిద్దరిని ఇంకా ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు పార్థా ఛటర్జీ బెయిల్ కోసం ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఆయన మంత్రి కాదని, సామాన్య వ్యక్తి అని అన్నారు. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, దర్యాప్తును ప్రభావితం చేయలేరని చెప్పారు.
ఇరు వైపు వాదనలు విన్న కోర్టు… పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీలకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరిని జైలుకు తరలించారు.