న్యూఢిల్లీ: ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 26న ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి జోషి పిలుపునిచ్చారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సామాన్య పౌరులంతా పాలుపంచుకునేందుకుగాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రెండు పోర్టల్లను రూపొందించిందని మంత్రి జోషి తెలిపారు. కాగా, ఆంగ్లంతోపాటు రాజ్యాంగంలో గుర్తించిన 23 భాషలలో రాజ్యాంగ ప్రవేశిక పఠనం కోసం కేంద్రం ఒక పోర్టల్ను అభివృద్ది చేసింది. రాజ్యాంగంపై ఆన్లైన్ క్విజ్ నిర్వహణ కోసం మరో పోర్టల్ను రూపొందించింది. దేశ పౌరులు ఎక్కడినుంచైనా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సర్టిఫికెట్లు పొందవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది.