New Parliament House | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్(నమస్తే తెలంగాణ) : కొత్త పార్లమెంట్ వేదికగా మరో వివాదానికి మోదీ సర్కార్ తెరలేపింది. ఎంపీలందరికీ అందజేసిన భారత రాజ్యాంగ పుస్తకాల పీఠికలో సెక్యులర్, సోషలిస్టు పదాల్ని తొలగించింది. సభ్యులకు అందజేసిన హిందీ ప్రతుల్లో మాత్రం ఆ పదాల్ని తొలగించలేదు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రం ఉద్దేశపూర్వకంగా చేసిందా? లేక తప్పిదమా? అనేది వివాదాస్పదంగా మారింది. ఇది రాజ్యాంగంపై దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. రాజ్యాంగం పట్ల కేంద్రం ఉద్దేశం ఏమిటని నిలదీశాయి. రాజ్యాంగాన్ని మార్చడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా పదాల తొలగింపు జరిగిందని విపక్షాలు అనుమానిస్తున్నాయి.
రాజ్యాంగ అవిర్భావంలో భారతదేశాన్ని ‘సార్వభౌమత్వ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం’గా అభివర్ణించింది. 1976లో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సార్వభౌమ, ప్రజాస్వామ్య పదాల మధ్య సోషలిస్ట్, సెక్యులర్ పదాలను చేర్చి ఇవీ భారతదేశ జాతి ఐక్యతకు, సమగ్రతకు నిదర్శనంగా పేర్కొన్నారు.
సోషలిస్ట్, సెక్యులర్ పదాలు మాయం కావడం పట్ల లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను చేర్చిన విషయం మాకు తెలుసు. రాజ్యాంగంలో ఆ పదాలు లేకపోవడం ఆందోళనకరం. మోదీ సర్కార్ ఉద్దేశం అనుమానస్పదంగా ఉంది’ అని అన్నారు.
విపక్షాల ఆరోపణలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ స్పందించారు. సభ్యులకు అందజేసిన రాజ్యాంగ ప్రతులు రాజ్యాంగం అవిర్భావం నాటివి. అందులో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేవని, వాటిని 1976లో చేర్చారని ఆయన గుర్తు చేశారు.