MGNREGS | న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల్లో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా ఒకేరీతిలో ఉపాధి హామీ వేతనాలు చెల్లించే అంశాన్ని పరిశీలించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వేతనాలు పెంచకపోవడంతో కూలీలు ఉపాధి పనులకు దూరమవుతున్నారని పేర్కొన్నది. వివిధ రాష్ట్రాల్లో ఉపాధి వేతనాలు రూ.204 నుంచి రూ.331 మధ్య ఉన్నాయని తెలిపింది. 2023-24లో సవరించిన రేట్ల ప్రకారం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అతి తక్కువగా రూ.221 ఉండగా, అత్యధికంగా హర్యానాలో రూ.331 ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాల్సిన ఉపాధి బకాయిలపైనా పార్లమెంటరీ ప్యానల్ ప్రశ్నలు లేవనెత్తింది. 2023 జనవరి 5 నాటికి కేంద్ర ప్రభుత్వం సుమారు 13వేల కోట్లు బకాయిలు పడిందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కోత పెట్టడంపై పార్లమెంటరీ ప్యానల్ మండిపడింది. 2022-23లో ఉపాధి పథకానికి రూ.73 వేల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. 2023-24లో దానిని రూ.60 వేల కోట్లకు తగ్గించింది.