ముంబై, మార్చి 25: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతో పాటు ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నితీశ్ రాణేపై సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరితో పాటు తమ కుమార్తె మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు. తమ కుటుంబ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని దిశా సాలియన్ తల్లిదండ్రులు సతీష్, వాసంతి పేర్కొన్నారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్కు దిశ మేనేజర్గా పనిచేశారు. 2020, జూన్ 8న ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రాజ్పుత్ కూడా అదే నెల 14న తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. ఈ రెండు ఘటనలను కనెక్ట్ చేస్తూ కొందరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు, ఊహాజనిత వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యతో ఉన్న రాజకీయ శత్రుత్వంతో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, నితీశ్లు కూడా ప్రెస్మీట్లతో అదే ప్రచారం చేస్తున్నారని వారు లేఖలో తెలిపారు. నారాయణ్ రాణే, ఆయన కుమారుడిపై ముంబై పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నెల మొదట్లో పోలీసులు మంత్రిని ప్రశ్నించారు.