Madras High Court | తల్లిదండ్రుల పోషణ, పిల్లలకు ఆస్తుల పంపకాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పిల్లలకు ఆస్తుల పంపకాలపై తలెత్తిన కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తమ పోషణను సరిగ్గా పట్టించుకోకుంటే పిల్లలకు కేటాయించిన ఆస్తులను వెనక్కు తీసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని ఆ తీర్పులో తేల్చి చెప్పింది. ‘ఒకవేళ పిల్లలు తమకు ప్రేమ, ఆప్యాయత సరిగ్గా పంచక పోతే తల్లిదండ్రులు తమ ఆస్తులను ఏకపక్షంగా వెనక్కి తీసేసుకోవచ్చు’ అని జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియం సారధ్యంలోని బెంచ్ పేర్కొంది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద తల్లిదండ్రులను పిల్లలు సంత్రుప్తి పర్చాల్సి ఉంటుందని వెల్లడించింది.
‘ప్రేమ, ఆప్యాయతల కింద తల్లిదండ్రులు తమ పిల్లలకు గిఫ్ట్ లేదా సెటిల్మెంట్ డీడ్ రూపంలో ఆస్తులు ఇవ్వవచ్చు. ఇందులో ఏ ఉల్లంఘన జరిగినా తల్లిదండ్రులు-సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆదేశాల్లో ఎటువంటి బలహీనతలు లేవు` అని హైకోర్టు తెలిపింది.
పెద్దల పట్ల మానవీయ కోణంలోనే వ్యవహరించాలన్నదే ఈ చట్టం ఉద్దేశం. సీనియర్ సిటిజన్ల భద్రత, గౌరవాన్ని రక్షించకపోతే ఈ చట్టం అమల్లోకి వస్తుంది` అని జస్టిస్ సుబ్రమణియం తెలిపారు.