అమృత్సర్ : పంజాబ్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఈ నెల 20న నిర్ణయం తీసుకోవడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 11,12వ తరగతి విద్యార్థులకు బడులు ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశాఖ సూచన మేరకు పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
విద్యార్థులు తరగతిలోకి వచ్చే ముందు విధిగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
తరగతిలో ఉపాధ్యాయులతో సహా ప్రతిఒక్కరూ తప్పక మాస్కు ధరించాలి.
ఉపాధ్యాయులంతా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలి.
తరగతి గదిలో ఎవరైనా విద్యార్థి అస్వస్థతకు గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య చికిత్స అందించాలి. ఈ నిబంధనలు విధిగా పాటించాలని పాఠశాల నిర్వాహకులకు ప్రభుత్వం సూచించింది. నాలుగు నెలల విరామం తర్వాత ఇక్కడ పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ తరగతులతో చాలా ఇబ్బంది పడ్డామని, పాఠశాలలు ప్రారంభంకావడంతో ఇబ్బందులు తొలగాయని విద్యార్థులు పేర్కొంటున్నారు.