జైపూర్ : పాకిస్తాన్లో తయారైన బీఫ్ చాక్లెట్ రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో విక్రయిస్తుండటం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. జంతు ప్రొటీన్ను ఉపయోగించి ఈ చాక్లెట్లను తయారుచేశారనే వార్తలతో ఆందోళన నెలకొంది. ఉదయపూర్లోని పోలీస్ కంట్రోల్ రూంకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఈ చాక్లెట్లను అమ్ముతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు వచ్చిన వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బీఫ్తో తయారుచేసిన చాక్లెట్లను సీజ్ చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న టాఫీలను పరీక్షించేందుకు డిపార్ట్మెంట్ అధికారులు వాటిని ల్యాబ్కు పంపారు. ఉదయ్పూర్లోని ఢిల్లీ గేట్ క్రాస్రోడ్స్లోని షాపులో బీఫ్ చాక్లెట్లు విక్రయిస్తుండగా అధికారులు దాడులు చేపట్టారు. మూడు భారీ ప్యాకేజ్ల్లో బీఫ్ చాక్లెట్లను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు.
ఈ షాపు నుంచి నగరంలోని ఇతర షాపులకు టాఫీలను సరఫరా చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. తాము ముంబైలో వీటిని కొనుగోలు చేశామని కానీ రసీదులు ఇవ్వలేదని షాపు యజమాని చెప్పారని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన పార్సిల్పై బలూచిస్ధాన్ చిరునామా రాసి ఉన్నట్టు గుర్తించారు. చిన్నారులు లక్ష్యంగా చిలి-మిలి పేరుతో వీటిని సేల్ చేస్తున్నారని, వీటిపై మేడిన్ పాకిస్తాన్ అని రాసిఉందని అధికారులు తెలిపారు.