చంఢీఘడ్: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూపై .. పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీంద్ సింగ్ ఓ సంచలన కామెంట్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధూను తమ క్యాబినెట్లోకి తీసుకోవాలని గతంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించినట్లు ఆరోపించారు. సిద్ధూను మీ క్యాబినెట్ తీసుకోవాలని, అలా చేస్తే మీకు కృతజ్ఞుడినై ఉంటానని, సిద్దూ తనకు ఓ పాత మిత్రుడు అని, ఒకవేళ ఆయన సరిగా పనిచేయకుంటే, అతన్ని తొలగించవచ్చు అని పాకిస్థాన్ ప్రధాని తనకు రిక్వెస్ట్ పంపినట్లు అమరీందర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత అయిన అమరీందర్.. సిద్ధూతో వివాదం వల్ల సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీని స్థాపించారు. ఇప్పుడు పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ 65 స్థానాల్లో, అమరీందర్ పార్టీ 37 స్థానాల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఇక సంయుక్త్ అకాలీదళ్ మరో 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు బీజేపీ నేత నడ్డా తెలిపారు. పంజాబ్ సరిహద్దు రాష్ట్రమని, ఇక్కడ భద్రత చాలా కీలకమని నడ్డా అన్నారు.