న్యూఢిల్లీ : పాక్ పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలను సందర్శించేందుకు 112 మంది భారతీయులకు పాక్ మంగళవారం వీసాలు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి 23 వరకు కటాస్ ఆలయాల సముదాయం సందర్శించేందుకు వీసాలు జారీ చేసినట్లు న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ తెలిపింది. కటాస్ ఆలయాలు చెరువు చుట్టూ ఉండగా.. వాటిని సందర్శించడాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తున్నారు.
1974లో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు వీసాలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ భారతీయ యాత్రికుల కోసం వీసాలు ఇస్తున్నది. ఈ నెల 4న సింధ్లోని షాదానీ దర్బార్ హయత్ పిటాఫీలో సద్గురు సంత్ షాదరామ్ సాహిబ్ 313వ జయంతి వేడులకు హాజరయ్యేందుకు 136 మందికి పాక్ హైకమిషన్ వీసాలు జారీ చేసింది.