ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశాల వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఇస్లామిక్ దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే భారత్లోని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలను తాము తీవ్రంగా నిరాశపరిచామని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఇమ్రాన్ ఈ సమావేశాల వేదికగా ఆరోపించారు. ఇక… పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పాటు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కూడా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్ సమస్యను శాంతి పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఈయన సూచించారు.
‘పాలస్తీనా, కశ్మీర్ ప్రజలను మనం తీవ్ర నిరాశకు గురిచేశాం. వారి కోసం మనం ఏమీ చేయలేదు. ఇలా చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాను. అంతర్జాతీయ చట్టాలు పాలస్తీనా ప్రజలు, కశ్మీర్ ప్రజల వైపే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వారి హక్కుల గురించి మాట్లాడుతుంది. ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం తమ భవిష్యత్తును నిర్ణయించే అధికారం కశ్మీర్ ప్రజలకు ఉంటుందని అంతర్జాతీయ సమాజం పేర్కొంది. కానీ అలాంటి అధికారాన్ని కశ్మీర్ ప్రజలకు ఎన్నడూ ఇవ్వలేదు. పైగా ఆర్టికల్ 370ని రద్దు చేశారు. వారి హక్కులను లాగేసుకున్నారు’ అంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ 48 వ సమావేశాలు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు 57 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈసారి పాకిస్తాన్ ఈ సమావేశాలకు ఆతిథ్యమిస్తోంది. అయితే చైనాను కూడా ఈ సమావేశాలకు పాక్ ఆహ్వానించింది. ఇలా ఇస్లామిక్ దేశాల మీటింగ్లకు చైనా తరపున ఓ మంత్రి హాజరు కావడం ఇదే ప్రథమం. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొనబోయే 57 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఓ ట్వీట్ చేశారు. ఈ సదస్సులో పాల్గొనబోయే విదేశాంగ మంత్రులు, ప్రతినిధులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐకమత్యం, న్యాయం, అభివృద్ధి …. ఈ మూడు అంశాలను ఇందులో చర్చకు వస్తాయని ఇమ్రాన్ పేర్కొన్నారు.