తన పదవి ఉంటుందో? ఊడుతుందో? తెలియని అయోమయ స్థితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హఠాత్తుగా భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. తనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తోన్న ఎంపీలనుద్దేశించి మాట్లాడుతూ.. ఇమ్రాన్ భారత్పై తెగ ప్రశంసలు కురిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ‘భారత విదేశాంగ విధానం ఎప్పుడూ స్వతంత్ర మూలాలున్న విదేశాంగ విధానం. భారత్ను నేనెంతో మెచ్చుకుంటా. ప్రశంసిస్తా. అమెరికాకు మిత్రదేశంగా ఉంటోంది. తటస్థమంటూ పేర్కొంటుంది. రష్యాపై ఆంక్షలు ఉన్న సమయంలోనే ఆ దేశం నుంచి భారత్కు చమురు అందుతోంది. భారత విదేశాంగ విధానం అంత ఉత్తమమైంది. భారత విదేశాంగ విధానం ప్రజల అభ్యున్నతి కోసమే ఉంది’ అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ తెగ ప్రశంసలు కురిపించారు.
ఇక తన ప్రత్యర్థులపై ఇమ్రాన్ తీవ్రంగా మండిపడ్డారు. మీరు మనస్సాక్షిని అమ్ముకున్నారని పాక్ ప్రజలకు అర్థమైందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీ పేర్ల ముందు శాశ్వతంగా దేశద్రోహి అన్న పదం మిగిలిపోతుందని ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం మన ముందు రెండే రెండు దారులున్నాయని, బడా బాబుల వైపు నిలబడడమా? పాక్ ప్రజల వైపు నిలబడడమా? అన్న ది తేల్చుకోవాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశ ప్రజలు కూడా ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని కోరారు. 25 సంవత్సరాలుగా దోచుకున్న డబ్బులతో ఎంపీలను కొనాలని చూస్తున్నారని ఇమ్రాన్ మండిపడ్డారు.