న్యూఢిల్లీ, జూన్ 18: హంగోర్ అనే పేరు చరిత్రను గుర్తుచేస్తుంది. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ హంగోర్ భారత్కు చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచివేసింది. స్వాతంత్య్రం తర్వాత యుద్ధ సమయంలో ఒక భారత నావికాదళ యుద్ధనౌక మునిగిపోవడం అదే మొదటిసారి. ఆ ఘటన పాక్ నావికాదళం జరిపిన ప్రముఖ నావికా దాడులలో ఒకటిగా నిలిచింది. అయితే ఐఎన్ఎస్ ఖుక్రీ మునిగిపోవడం 1971 యుద్ధ ఫలితాన్ని పెద్దగా మార్చలేకపోయింది.
భూమి, గాలి, సముద్ర మార్గాలలో భారత బలగాలు పాకిస్థానీలను చిత్తు చేసి బంగ్లాదేశ్ విముక్తికి సహాయపడటంతో పాకిస్థాన్ హోర పరాజయాన్ని చవిచూసింది. 1971లో బంగాళాఖాతంలో పాకిస్థాన్ ఉనికిని తుడిచిపెట్టిన ఘోర పరాజయం జరిగిన 55 సంవత్సరాల తర్వాత మరో పాకిస్థానీ హంగోర్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు చెందిన మొట్టమొదటి హంగోర్-శ్రేణి జలాంతర్గామిని ఏప్రిల్లో చైనాలో అధికారికంగా ప్రారంభించిన తర్వాత గత వారం అది కరాచీకి చేరుకుంది. అంతేగాక పాకిస్థాన్ నావికాదళ ఉన్నతాధికారులు ఇప్పటికే దాని ప్రధాన కేంద్రమైన అరేబియా సముద్రానికి అతీతమైన భూమిక గురించి మాట్లాడుతున్నారు. స్వదేశానికి చాలా దూరంలో ఉన్న బంగాళాఖాతంలో తన ఉనికిని కొనసాగించే సామర్థ్యాన్ని ఈ జలాంతర్గామి పాక్కు అందించగలదని ఒక పాక్ సీనియర్ నావికాదళ అధికారి పేర్కొన్నారు.
హగోర్-గేమ్ చేంజర్
ఈనెల ప్రారంభంలో శ్రీలంకలో పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ఒక సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై ది మార్నింగ్ వార్తా పత్రిక కథనం ప్రకారం కొత్త జలాంతర్గామిని స్వదేశానికి తీసుకువస్తున్న నౌకాదళానికి కమాండర్ అయిన కమోడోర్ ఒమర్ ఫరూఖ్ హంగోర్-శ్రేణి లాంతర్గాముల చేరిక బంగాళాఖాతంలో తన ఉనికిని కొనసాగించే సామర్థ్యాన్ని పాక్కు ఇస్తుందని అన్నారు. 8 జలాంతర్గాములను పాక్ చైనా నుంచి కొనుగోలు చేయాలని యోచిస్తున్నదని పేర్కొన్నారు.
ఉనికి లేని పాక్
1971 యుద్ధంలో పాక్ తన భూభాగంలో సగాన్ని కోల్పోయినప్పటి నుండి ఆ ప్రాంతంలో తన నావికాదళ ఉనికి పాక్కు నామమాత్రంగానే ఉంది.పాక్ నౌకాదళ ఉనికి ప్రధానంగా ఉత్తర అరేబియా సముద్రానికే పరిమితమైంది. దీనికి భిన్నంగా బంగాళాఖాతం భారతదేశం గణనీయమైన భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అనుభవిస్తున్న ప్రాంతం.