Pahalgam Attack : పహల్గాం (Pahalgam) లో ఉగ్రవాదుల దాడి జరిగి నేటికి ఏడాది పూర్తయ్యింది. కానీ ఆ మారణహోమం మిగిల్చిన విషాదం మృతుల 26 కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఆ ఘటనకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది. నాటి దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల (Pakistani Terrorists) కు స్థానికులైన ఇద్దరు ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల గురించి వారు పోలీసులకు చెప్పే అవకాశం ఉన్నా చెప్పకుండా రహస్యంగా ఉంచారని వెల్లడైంది. చెప్పకుండా ఉండటం కోసం వారు ఉగ్రవాదుల నుంచి రూ.3 వేల లంచం తీసుకున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.
గత ఏడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదుల దాడి జరిగింది. అంతకుముందు రోజు అంటే ఏప్రిల్ 21న రాత్రి 10.30 గంటల సమయంలో స్థానికులు పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులు ఆశ్రయం పొందారు. ఆ సమయంలో వారి వద్ద ఆయుధాలు కనిపించాయి. ఉర్దూ, పంజాబీ కలగలిసిన భాష మాట్లాడారు. లష్కరే తయిబా అగ్ర కమాండర్, ప్రధాన నిందితుడు సాజిత్ జాట్ అలియాస్ అలీభాయ్ గురించి వారు మాట్లాడుకున్నారు. తమ ప్రాంతంలో దాడి జరగడం ఖాయమని వారి మాటల్ని బట్టి అర్థమైనా.. ఆ ఇదందకె పోలీసులను అప్రమత్తం చేయకుండా మౌనంగా ఉండిపోయారని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
ఐదు గంటలపాటు వారి వద్ద ఆశ్రయం పొందిన ఆ ముగ్గురు ఉగ్రవాదులు అక్కడే తినేసి వెళ్లిపోయారు. అందుకోసం రూ.3 వేలు ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ 22న దాడి జరగడానికి కొన్ని గంటల ముందు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆ ఉగ్రవాదులు బైసరన్ లోయలోని ఒక కంచె వెనకాల దాక్కొన్నారు. ఆ విషయాన్ని పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్లు గుర్తించారు. అప్పుడు కూడా పోలీసులకుగానీ, స్థానిక టూరిస్ట్ ఆపరేటర్లకుగానీ వారు సమాచారం ఇవ్వలేదని వెల్లడైంది. ఆ ఇద్దరూ తమ గుర్రాలు ఎక్కడానికి పర్యాటకులు ఎవరైనా వస్తారా..? అని మాత్రమే చూసుకున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో కొందరు రాగానే వారిని పహల్గాంలోని బైసరన్లోయకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని గంటలకు అక్కడ కాల్పుల మోత వినిపించడం, ఆ వాతావరణమంతా రక్తసిక్తమవడాన్ని చూశారు. ఆ తర్వాత దాంతో తమకేం సంబంధం లేదన్నట్టుగా నిశ్శబ్దంగా అక్కడినుంచి జారుకున్నారని తెలిసింది. ఎన్ఐఏ వారిని గత ఏడాది జూన్ 22న అరెస్టు చేసింది. డిసెంబర్లో ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో సాజిత్ జాట్ పేరుతో పాటు ఆ స్థానికుల పేర్లను చేర్చింది.