ఈ భూమండలంపై ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఏ ఆలయం విశిష్టత దానికే ఉంటుంది. ఓ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, మరో ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటే ధన లబ్ధి చేకూరుతుందని, ఇంకో ప్రాంతంలోని ఆలయానికి వెళ్తే శని తొలగిపోతుందని, వేరొక ప్రాంతంలోని ఆలయంలో దైవ దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయని ఇలా రకరకాలుగా భక్తులు విశ్వసిస్తుంటారు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి పరిహారాల కోసం కొందరు భారీ ఎత్తున ఖర్చులు కూడా చేస్తుంటారు. ఇవన్నీ మీరు వినే ఉంటారు. కానీ చేసిన పాపం పోయినట్టుగా సర్టిఫికెట్ సైతం ఇచ్చే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..? మనం ఇప్పుడు ఆ ఆలయం గురించే చెప్పుకోబోతున్నాం..
మనిషి తెలియక కొన్ని, తెలిసి కొన్ని పాపాలు చేస్తుంటాడు. చేసిన పాపాలను కడిగేసుకోవడానికి ఆలయాలకు వెళ్తుంటాడు. అంతేగాక పాప పరిహారాల కోసం సిద్ధాంతులు చెప్పే పూజలకు లక్షలు ఖర్చు చేస్తాడు. దోచిన దాంట్లో కొంత దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని కొందరు దానధర్మాలు కూడా చేస్తుంటారు. ఇవన్నీ మామూలే. కానీ లక్షల్లో ఖర్చులు, భారీ దానాలు లేకుండానే ఓ ఆలయంలో కేవలం రూ.12 ఖర్చుతో పాపాన్ని కడిగేసుకోసుకోవచ్చు. పాపం పోయినట్టుగా సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. ఇది వెరైటీ. మరె మీరు కూడా ఆ ఆలయం విశిష్టతను తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే పదండి అక్కడికే వెళ్దాం.
రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో ఒక పురాతన ఆలయం ఉన్నది. ఆ ఆలయం గత కొన్ని శతాబ్దాలుగా తీర్థ యాత్రలకు ప్రసిద్ధిగాంచినది. ఆ ఆలయాన్ని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలోనే ఎన్నో ఏళ్లుగా అక్కడికి వచ్చే భక్తులకు చేసిన పాపం పోయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే ఆచారం ఉన్నది. దీన్నే గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం పక్కనే ‘మందాకిని పాప విమోచిని గంగా కుంద్’ అనే రిజర్వాయర్ ఉంది. ఆ జలాశయం నీటితో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ గుడిలో కేవలం రూ.12 చెల్లించి పుణ్య స్నానం చేయవచ్చు. రిజర్వాయర్లోకి వెళ్లలేని వారు గుడిలోని వాటర్ ట్యాంక్లో నింపిన రిజర్వాయర్ నీటితో స్నానం చేసినా సరిపోతుంది.
చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా ఆలయానికి తరలి వస్తుంటారని, వారందరికీ పాప విమోచన సర్టిఫికెట్ కూడా ఇస్తామని ఆలయ పూజారి చెప్పారు. ప్రతి ఏడాది ఆలయంలో దాదాపు 250 నుంచి 300 పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందన్నారు. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచి కొనసాగుతున్నట్లు దేవాలయ అధికారులు చెబుతున్నారు.