న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను 40 ఏండ్ల వయసున్న నేత ఎందుకు చేపట్టకూడదని ఆ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ 40 ఏండ్ల వయసులోనే కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్ధాయి పదవులన్నీ 50 ఏండ్ల లోపు వారికి కట్టబెట్టాలని సూచించారు. చిదంబరం గురువారం ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు.
బీజేపీలో అన్ని నిర్ణయాలు ఓ వ్యక్తి లేదా ఆయన సూచించిన ప్రతినిధి కనుసన్నల్లో జరుగుతాయని, కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులకే నిర్ణయాధికారం ఉన్నా అన్ని స్ధాయిల్లో సమగ్ర సంప్రదింపులు జరిపిన మీదటే నిర్ణయం ప్రకటిస్తారని చిదంబరం చెప్పుకొచ్చారు. మోదీతో రాహుల్ గాంధీ సరితూగనందునే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవుతోందనే విమర్శలను తాను అంగీకరించనని పేర్కొన్నారు.
యుద్ధంలో జనరల్స్ కీలకమైనా వారు యుద్ధాన్ని గెలవలేరని, సైనికులు ఆ పని చేస్తారని అన్నారు. 2019లో రాహుల్ నాయకత్వంలో కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో తాము పోటీ చేసిన స్ధానాలన్నింటిలో గెలుపొందామని చెప్పారు. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం పీవీ నరసింహారావు హయాం నుంచే మొదలైందని, ఈ రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడటానికి విభిన్న కారణాలున్నాయని పేర్కొన్నారు.