మనాలి: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం రోహ్తంగ్ జిల్లాలోని అటల్ టన్నెల్లో ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న టూరిస్ట్ కారు డ్రైవర్.. ముందువెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసేందుకు ఎదురుగా వాహనాలు వచ్చే లైన్లోకి వెళ్లాడు. అయితే ఆ లైన్లో వాహనం వస్తున్నది గమనించి స్టీరింగ్ను ఎడమవైపునకు లాగి ఎడమ వైపున ఉన్న గోడను ఢీకొట్టాడు. అయినా కంట్రోల్ కాని కారు అదేవేగంతో వచ్చి కుడివైపు గోడను ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కానీ ఆ కారులోని నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, అదేవేగంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టినా లేదంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని డీకొట్టినా ఘోరం జరిగేది. కాగా, కారును ర్యాష్గా నడిపిన డ్రైవర్పై చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన 10 సెకన్ల వీడియో క్లిప్ సీసీ కెమెరాకు చిక్కింది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించండి.