ఔరంగాబాద్: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. శనివారం ఆయన ఔరంగాబాద్లోని డాక్టరేట్ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివాజీని పాత రోజుల్లో ఐకాన్గా భావించేవారని, ఇప్పుడు అంబేద్కర్, గడ్కరీని ఐకాన్గా భావిస్తున్నారని అన్నారు. దీంతో ఆయనపై విపక్షాలు మండిపడ్డాయి. ఛత్రపతి శివాజీ ప్రతిష్ఠను చిన్నబుచ్చేలా వ్యాఖ్యానించారని ఎన్సీపీ విమర్శించింది. మహారాష్ట్రీయుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్న కోశ్యారీని వెంటనే తొలగించాలని రాష్ట్రపతిని కోరింది. కాగా, గతంలోనూ శివాజీపై కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమర్థ రామదాసు లేకుండా ఛత్రపతి శివాజీ లేనేలేరని అనటం వివాదానికి దారి తీసింది.