న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi Lieutenant Governor VK Saxena) కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్లో శిక్షణపై ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఆయన స్పందన కోరింది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఫిన్లాండ్లో శిక్షణకు సంబంధించిన ఫైల్ను మార్చి 4న ఎల్జీ వీకే సక్సేనా క్లియర్ చేశారు. అయితే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు భవిష్యత్తులో విదేశీ శిక్షణ పొందకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోనే వారికి శిక్షణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది షాదన్ ఫరాసత్ వాదనలు వినిపించారు. ఈ విషయంలో ఎల్జీ స్వతంత్ర నిర్ణయం తీసుకోలేరని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు భవిష్యత్తులో విదేశాల్లో శిక్షణపై నిషేధం విధించే అధికారం ఆయనకు లేదన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 4న ఎల్జీ జారీ చేసిన ఆదేశాలను కొట్టివేయాలని కోర్టును కోరారు. అలాగే 2022 అక్టోబర్ 18న ఢిల్లీ ప్రభుత్వం, ఎస్సీఈఆర్టీ చేసిన ప్రతిపాదనను ధృవీకరించాలని అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని కోరుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కార్యాలయానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.