కోహిమా: నాగాలాండ్లోని ఒకే లోక్సభ స్థానానికి శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. అయితే, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల ప్రజలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. దీంతో నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్ నమోదైంది. (Zero voter turnout) ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ (ఎఫ్ఎన్టీ)ని ఏర్పాటు చేయాలని తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్పీవో) 2010 నుంచి డిమాండ్ చేస్తున్నది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపై స్పందించకపోవడంపై ఏడు గిరిజన సంఘాలతో కూడిన ఈ సంస్థ లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం ఏ రాజకీయ పార్టీని అనుమతించబోమని పేర్కొంది. అలాగే 20 అసెంబ్లీ సీట్లున్న ఆరు జిల్లాల్లో పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
కాగా, ఈ ఆరు జిల్లాల్లో సుమారు నాలుగు లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. దీంతో 738 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు భారీగా బందోబస్తు ఉంచారు. అయితే తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్పీవో) నిరసన పిలుపునకు ఆరు జిల్లాల ప్రజల మద్దతిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్కు సంఘీభావంగా పోలింగ్ రోజున ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఓటింగ్ నమోదు కాలేదని ఎన్నికల అధికారి తెలిపారు.