కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. గత రెండు రోజులుగా ముర్షిదాబాద్, కోల్కతా, ఢిల్లీతోపాటు 28 ప్రాంతాల్లోని ఆయన ఆస్తులను తనిఖీ చేశారు. ఆయనకు చెందిన నివాసాలు, రైస్ మిల్లు, బీడీ ఫ్యాక్టరీలను సోదా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జాకీర్కు చెందిన ముర్షిదాబాద్ కార్యాలయం నుంచి రూ.10.9 కోట్ల నగదును గురువారం స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులపై తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ఎమ్మెల్యే జాకీర్ వ్యాపారవేత్త అని తెలిపారు. టీఎంసీలో చేరక ముందు నుంచే ఆయన పెద్ద స్థాయిలో బీడీ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. అలాంటి వ్యాపారాల్లో భాగంగా కార్మికులకు జీతాలు చెల్లించడానికి నగదు అవసరం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో ఉన్న రూ.10.9 కోట్ల డబ్బును ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు పూర్తికాక ముందే అది అక్రమ డబ్బు అనడం సరికాదన్నారు.